ilakkiya
విజయవాడ:
జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) అమలుకు సంబంధించి విస్తృత తనిఖీలు నిర్వహించాలని.. ఎక్కడైనా పక్కదారి పడితే చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ హెచ్చరించారు.
జేసీ ఇలక్కియ శుక్రవారం ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరు, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, నిల్వను అరికట్టే విషయాలపై జిల్లా పౌర సరఫరా శాఖ సిబ్బంది, రెవిన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్లు, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ, పోలీస్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమన్వయ శాఖల అధికారుల బృందాలు బోర్డర్ చెక్ పోస్ట్ కు వచ్చే వాహనాలు, కోళ్ల ఫారాలు, చేపల చెరువులను విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎక్కడైనా ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పంపిణీ చేసే బియ్యాన్ని వినియోగిస్తే 6ఏ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అదే విధంగా జిల్లాలోని అందరు ఎల్పీజీ డీలర్లతో సమావేశం నిర్వహించి గ్యాస్ పంపిణీ తీరుపై సమీక్షించారు. గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన డెలివరీ బాయ్స్ వినియోగదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడటం ముఖ్యమన్నారు. గ్యాస్ ధర కంటే ఎక్కువ మొత్తం వసూలు చేసినట్లు తేలితే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జేసీ ఇలక్కియ స్పష్టం చేశారు.

